త్రివేణి సంగమం: తెలుగురాష్ట్రాల్లో ఈ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏయే నదులు కలుస్తాయి?

ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా మహోత్సవం జరుగుతోంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వచ్చి అక్కడి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు.
ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం గంగ, యమున, సరస్వతి నదుల సంగమంగా ప్రసిద్ధి పొందింది. అయితే, సరస్వతి నది ప్రస్తావన పురాణాల్లో ఉంది. కానీ అక్కడ సరస్వతి నది కనిపించదు. అది అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుందని పండితుల మాట.
ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తే పాపాలు తొలగి, ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. పునర్జన్మ నుంచి ముక్తి పొందడమే మోక్షంగా హిందువులు భావిస్తారు.
సాధారణంగా రెండు నదులు కలిసే ప్రాంతాన్ని సంగమం అంటారు. అదే మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం అంటారు. సంగమ స్నానాన్ని, ముఖ్యంగా త్రివేణి సంగమ స్నానాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ?
అయితే, ప్రయాగ్రాజ్లోనే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో త్రివేణి సంగమాలు ఉన్నాయి. ఇక్కడ మూడు నదులు లేదా ఉప నదులు కలుస్తూ సంగమ ప్రదేశంగా మారుతున్నాయి.
ఈ ప్రదేశాలను త్రివేణి సంగమంగా భావిస్తూ.. భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రజల భక్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వాలు ఆ ప్రాంతాలను త్రివేణి సంగమంగా పేర్కొంటున్నాయి.
అయితే, తెలుగు రాష్ట్రాల్లో త్రివేణి సంగమాలు ఎక్కడున్నాయి? ఆ ప్రాంతాల్లో ఏయే నదులు, ఉపనదులు కలుస్తున్నాయో తెలుసుకుందాం.